దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు జోరుగా దంచికొడుతున్నాయి. ముఖ్యంగా రోజువారీ భారీ వర్షాలకు ఈశాన్య భారతం అల్లకల్లోలంగా మారింది. పలు రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సిక్కి అల్లకల్లోలంగా మారింది. శనివారం నార్త్ సిక్కింలో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 1,500 మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. అందులో 8 మంది పర్యాటకులు గల్లంతయ్యారు.
ఈ గల్లంతైన పర్యాటకుల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో తీస్తా నది నీటిమట్టం విపరీతంగా ఉప్పొంగడంతో అధికారులు సహాయక చర్యలను ఆపేశారు. మాంగన్ జిల్లాలోని లాచెన్-లాచుంగ్ హైవేపై గుర్తుతెలియని వాహనం నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో టూరిస్టులు గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇలా లాచుంగ్ లో 1,350 మంది, లాచెన్లో 115 మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. మరోవైపు ఈశాన్య భారతంలో ఇదే పరిస్థితి నెలకొంది. నైరుతి రుతుపవనాల కారణంగా ఈశాన్య భారతంలో పరిస్థితులు అధ్వనంగా మారాయి. గడిచిన రెండు రోజుల్లో దాదాపు 30 మందికిపైగా ప్రజలు ప్రాణాలు విడిచినట్లు సమాచారం.
అదే సమయంలో హిమాచల్ ప్రదేశ్కి భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్లలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు కర్ణాటకలో 71 మంది ప్రాణాలు విడిచారు. ఏప్రిల్ నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 71 మంది మృతి చెందినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కార్యాలయం ప్రకటించింది.
కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు చాలా మంది ప్రజలు అనేక కారణాలతో చనిపోయారు. పిడుగుపాటుకు గురై 48 మంది, చెట్లు విరిగిపడిన 9 మంది, ఇళ్లు కూలి 5గురు, నీటిలో మునిగి 4గురు, కొండచరియలు విరిగిపడి 4గురు, విద్యుదాఘాతంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇలా పలు కారణాలతో మొత్తం 71 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని అందించింది. అయితే ఒక్క ప్రజలు మాత్రమే కాకుండా.. 702 జంతువులు మరణించాయని.. 2,068 గృహాలు కూలిపోయాయని.. 15,378.32 హెక్టార్ల పంట ధ్వంసమైందని అధికారులు తెలిపారు.