పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త పవన్ అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. మంగళవారం (జూలై 29)న మైత్రీ మూవీ మేకర్స్ ఈ అప్డేట్ను పంచుకున్నారు.
ఈ క్లైమాక్స్ సన్నివేశాలు భావోద్వేగాలు, యాక్షన్ కలగలిపి అత్యంత పవర్ఫుల్గా రూపొందాయని, నబకాంత మాస్టర్ పర్యవేక్షణలో అద్భుతంగా చిత్రీకరించారని చిత్ర బృందం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ తన బాధ్యతలతో పాటు, ఇటీవల విడుదలైన ‘హరి హర వీరమల్లు’ ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నప్పటికీ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ను శరవేగంగా పూర్తి చేయడం ఆయన అంకితభావాన్ని, కష్టపడి పనిచేసే స్వభావాన్ని చాటుతుందని నిర్మాతలు ప్రశంసించారు.
‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తర్వాత పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మాస్, యాక్షన్ ప్రియులను ఎంతగానో అలరిస్తుందని నిర్మాతలు హామీ ఇచ్చారు. క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి కావడంతో, సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.






