ఘనంగా ప్రారంభమైన ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’మూవీ..

టాలెంటెడ్ హీరో కార్తిక్ రాజు కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కౌసల్యా కృష్ణమూర్తి, అథర్వ లాంటి చిత్రాలతో సినీ ఆడియన్స్‌ను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ హీరో ప్రస్తుతం మరో కొత్త సినిమాతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కార్తిక్ రాజు ప్రస్తుతం శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్‌పై ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’చిత్రంలో నటిస్తున్నాడు.

రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని గాలి కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ‘అనగనగా’ ఫేమ్ కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. మల్లవరం వేంకటేశ్వర రెడ్డి, రూప కిరణ్ గంజి సహ నిర్మాతలుగా ఉన్నారు. ఈ చిత్రాన్ని తాజాగా గ్రాండ్‌ లెవెల్లో లాంచ్ చేశారు. రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో భారీ స్థాయిలో ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమాలకు ప్రముఖులు హాజరయ్యారు.

నిర్మాత సురేష్ బాబు, క్రాంతి మాధవ్, తమ్మారెడ్డి భరద్వాజ, భీమనేని శ్రీనివాస రావు, హీరో చైతన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తమ్మారెడ్డి భరద్వాజ స్క్రిప్ట్ అందజేయగా.. ముహూర్తపు సన్నివేశానికి సురేష్ బాబు క్లాప్ కొట్టారు. అలాగే హీరో చైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్‌కి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.

దర్శకుడు రాజా దుస్సా మాట్లాడుతూ.. 1980లో వరంగల్‌లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా చేయాలని ప్లాన్ చేశామని చెప్పారు. కార్తీక్ రాజు, కాజల్ చౌదరిలతో ఈ సినిమా చేస్తుండటం చాలా సంతోషంగా ఉందని.. నిర్మాత గాలి కృష్ణ సహకారం ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.

అలాగే తమ కోసం వచ్చిన నిర్మాత సురేష్ బాబు, తమ్మారెడ్డి, క్రాంతి మాధవ్, భీమనేని శ్రీనివాసరావు, చైతన్యకి కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో హీరో కార్తిక్ రాజు మాట్లాడుతూ.. 80వ దశకంలో జరిగే కథతో ఈ సినిమా రాబోతోందని అన్నాడు. హీరోయిన్ కాజల్ చౌదరి ప్రస్తుతం పలు సినిమాల సక్సెస్‌లతో ఫుల్‌గా దూసుకుపోతోందని తెలిపాడు. ఆమెతో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉందని చెప్పాడు.

ఈ అవకాశాన్ని తనకు ఇచ్చిన దర్శకుడు రాజా దుస్సా, నిర్మాత గాలి కృష్ణకి ధన్యవాదాలు తెలిపారు. ఇక చివరిగా ఈ సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్లు త్వరలో వస్తాయని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.

తరవాత కథనం