యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న కొత్త సినిమా ‘ది ఇండియా హౌస్’. ఈ చిత్రానికి రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఊహకందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ‘ది ఇండియా హౌస్’ షూటింగ్ సెట్స్లో భారీ ప్రమాదం జరిగింది. గురువారం (జూన్ 12) నీటి ట్యాంక్ పగలడంతో మొత్తం సెట్లోకి వరద నీరు వచ్చి చేరింది. షామీర్పేటలోని జరిగిన ఈ సెట్ ప్రమాదంలో వరదలో కొందరు సిబ్బంది గాయపడ్డారు. సెట్కు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో షూటింగ్కు బ్రేక్ పడింది. సముద్రంలో సీన్ను చిత్రీకరించడం కోసం నీటి ట్యాంక్ వినియోగిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు మూవీ టీం తెలిపింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్లలో సినిమా సెట్లో నీరు పొంగిపొర్లడం చూడవచ్చు. ఆ సమయంలో నటీనటులు, సిబ్బంది గట్టిగా అరుస్తున్నారు. కొందరు నీటి ప్రవాహం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. మరికొందరు సెట్లోని వస్తువులను బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించారు.
ఈ ఘటనపై హీరో నిఖిల్ స్పందించాడు. ఇది చాలా పెద్ద ప్రమాదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు జరిగిన వివరాలను వివరించాడు. ప్రాణ నష్టం ఏమీ జరగలేదని అన్నాడు. తామంతా సురక్షితంగా ఉన్నామన్నారు. కొన్నిసార్లు ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలనే తపనలో రిస్క్లు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటన గురించి ముందుగానే అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకున్న సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. తామంతా పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డామన్నారు.






