ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మొత్తం ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో 265 మంది మరణించారు. ఎయిర్ ఇండియా విమానం పేలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. అయితే ఇప్పుడు ఈ విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది ప్రశ్న. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రయాణీకుల విమానాలలో ఒకటి ఇలా ఎలా నేలపై కూలిపోయింది అని అందరిలోనూ మెదులుతుంది.
ప్రస్తుతం ఈ ఘటనపై భారతదేశ విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (AAIB) బృందం దర్యాప్తు చేస్తోంది. అదే సమయంలో US జాతీయ రవాణా భద్రతా బోర్డు (NTSB) దర్యాప్తులో సహకరిస్తోంది. అంతేకాకుండా బ్రిటన్ వైమానిక ప్రమాదాల దర్యాప్తు శాఖ సహాయం కూడా తీసుకోనుంది. ఆ తర్వాత ప్రమాదం వెనుక కారణం ఏంటో స్పష్టమవుతుంది.
ఈ తరుణంలో అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన 28 గంటల్లోనే విమానం ఫ్లైట్ డేటా రికార్డర్ (బ్లాక్ బాక్స్)ను స్వాధీనం చేసుకున్నట్లు పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు X ద్వారా తెలిపారు. బోయింగ్ 787-8 విమానం బ్లాక్ బాక్స్ కనుగొన్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) సంఘటనా స్థలం నుండి బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకుంది.
బ్లాక్ బాక్స్లో ఉన్న సాంకేతిక సమాచారం, విమాన సంబంధిత డేటా సహాయంతో ప్రమాదానికి గల కారణాలను లోతుగా పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే ఈ బ్లాక్ బాక్స్కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో బ్లాక్ బాక్స్ కు సంబంధించినది కాదని MoCA స్పష్టం చేసింది. వైరల్ అవుతున్న వీడియో DFDR (డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్) కాదని మంత్రిత్వ శాఖ తెలిపింది. సంఘటనా స్థలంలో ఒక భవనం పైకప్పు నుండి నిజమైన బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.






