ఏపీలో ఈ రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను జారీ చేసింది. పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కి. మీ వేగంతో ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని సమాచారం. అందువల్ల ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర ఉంకూడదని విపత్తు సంస్థ హెచ్చరించింది.
ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు జోరుగా కురిసే ఛాన్స్ ఉందని ఆ సంస్థ వెల్లడించింది. నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. మరోవైపు ఇవాళ మరిన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికొట్టనున్నట్లు తెలుస్తోంది. విజయనగరం, పార్వతీపురంమన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో 40 నుంచి 41°C వరకు ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉంది.
తెలంగాణలోనూ
తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాకుండా ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేసింది.
మరికొన్ని చోట్లు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం జోరుగా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక జూన్ 12న గద్వాల, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.






