బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఘోరమైన సంఘటన జరిగింది. ఆర్సీబీ విక్టరీ పరేడ్ కార్యక్రమానికి వచ్చిన ఎంతో మంది అభిమానులు మృత్యవాత పడ్డారు. మరెందరో తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. ఈ తొక్కిసలాట ఘటనలో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. అయితే తొక్కిలాట ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ విక్టరీ పరేడ్ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. IPL 2025 ఫైనల్కు ముందు జూన్ 3న RCB యాజమాన్యం బెంగళూరు నగర పోలీసులను సంప్రదించి.. చిన్నస్వామి స్టేడియంలో విజయ పరేడ్కు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. కానీ పోలీసుల అనుమతి పొందక ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం Xలో పోస్ట్ ద్వారా తమ విజయ పరేడ్ గురించి సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించిందని వర్గాలు తెలిపాయి. RCB హ్యాండిల్ చేసిన ఈ పోస్ట్ వైరల్గా మారడంతో కొన్ని గంటల్లో 10 లక్షలకు పైగా వీక్షించారు.
ఈ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత స్టేడియం వెలుపల క్రికెట్ ప్రియులు, అభిమానుల సమూహం పెరిగింది. వేలమంది అభిమానులు స్టేడియం గేటు వద్దకు చేరుకున్నారు. జనాలు పెరగడంతో తొక్కిసలాట పరిస్థితి తలెత్తింది. దీనిలో 11 మంది మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు. అయితే బెంగళూరు పోలీసులు విక్టరీ పరేడ్కు తాము అనుమతి ఇవ్వలేదని RCBకి తెలియజేసినట్లు సమాచారం. జూన్ 4న విక్టరీ పరేడ్ను వాయిదా వేయాలని, నిర్వహించవద్దని RCB యాజమాన్యాన్ని పోలీసులు కోరినట్లు వర్గాలు తెలిపాయి. కానీ జూన్ 4న RCB పోలీసులతో చర్చించకుండా విక్టరీ పరేడ్ ఈవెంట్ టైం, ప్రదేశంతో ట్వీట్ చేసింది.
అది మాత్రమే కాకుండా ఆర్సిబి ఉచిత ఎంట్రీ పాస్లను కూడా ప్రకటించింది. దీంతో పరిస్థితి మరింత దిగజారిందని వర్గాలు తెలిపాయి. అలాగే ట్రాఫిక్కు కనీస అంతరాయం కలిగించేలా,భద్రతా ఏర్పాట్లు చేయడానికి తగినంత సమయం లభించే విధంగా ఆదివారం వేడుకను నిర్వహించాలని పోలీసులు సిఫార్సు చేసినట్లు వర్గాలు తెలిపాయి. పోలీసుల అభ్యర్థనను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని సమాచారం. జూన్ 3న అర్థరాత్రి నుండి జూన్ 4న తెల్లవారుజామున 4 గంటల వరకు పోలీసులు స్టేడియం వద్ద పనిచేశారు. దీంతో వారు బాగా అలసిపోయారని.. సిబ్బందిని తిరిగి నియమించడం కష్టమని పోలీసు అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.