ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ (MI) గుజరాత్ టైటాన్స్ (GT)ను 20 పరుగుల తేడాతో ఓడించింది. మే 30న (శుక్రవారం) ముల్లన్పూర్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై నిర్దేశించిన 20 ఓవలర్లలో 228 పరుగులు చేసింది. దీంతో గుజరాత్కు 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దిగింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఇప్పుడు MI క్వాలిఫైయర్-2లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది.
ఈ విజయంతో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కి చేరుకుంది. అక్కడ పంజాబ్ కింగ్స్ (PBKS)తో తలపడనున్నారు. మరోవైపు ఈ ఓటమితో గుజరాత్ టైటాన్స్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. క్వాలిఫయర్-2 మ్యాచ్ జూన్ 1న అహ్మదాబాద్లో జరగనుంది. క్వాలిఫయర్-2 మ్యాచ్ విజేత జూన్ 3న జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతుంది.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ జట్టు తొలి ఓవర్లోనే కెప్టెన్ శుభమ్ గిల్ (1) వికెట్ను కోల్పోయి దారుణంగా ఆరంభించింది. ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో శుభమన్ LBWగా ఔటయ్యాడు. తరువాత సాయి సుదర్శన్, కుశాల్ మెండిస్ ఇన్నింగ్స్ను మరింత ముందుకు నడిపించారు. దాదాపు 64 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. 20 పరుగులు చేసిన తర్వాత మిచెల్ సాంట్నర్ వేసిన బంతికి కుశాల్ మెండిస్ హిట్ వికెట్ గా ఔటయ్యాడు.
అక్కడి నుంచి సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ మధ్య మూడో వికెట్కు 84 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ఇది గుజరాత్ టైటాన్స్లో ఉత్సాహాన్ని నింపింది. సుందర్-సుదర్శన్ భాగస్వామ్యానికి జస్ప్రీత్ బుమ్రా అడ్డుకట్ట వేశాడు. వాషింగ్టన్ సుందర్ 48 పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.
అనంతరం సాయి సుదర్శన్ పై పెద్ద బాధ్యత పడింది. కానీ అతను ఫాస్ట్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. సుదర్శన్ 49 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ తో 80 పరుగులు చేశాడు. సుదర్శన్ ఔట్ అయ్యే సమయానికి గుజరాత్ స్కోరు 15.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు ఉంది.
ఇంపాక్ట్ సబ్గా వచ్చిన షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ (24) 19వ ఓవర్ మొదటి బంతికి ట్రెంట్ బౌల్ట్ చేతిలో అవుట్ అయ్యే ముందు కొన్ని పెద్ద షాట్లు ఆడాడు. అక్కడి నుంచి గుజరాత్ టైటాన్స్ విజయం కష్టమైంది. చివరి ఓవర్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు 24 పరుగులు అవసరం కానీ ‘ఇంపాక్ట్ సబ్’ అశ్వని కుమార్ ఆ ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి షారుఖ్ ఖాన్ (13 పరుగులు) వికెట్ కూడా తీసుకున్నాడు.