కృనాల్ పాండ్యా IPL 2025 ఫైనల్: 18 సంవత్సరాల నిరీక్షణ, RCB అభిమానుల బాధ, నిరాశకు తెరపడింది. ఉత్కంఠభరితమైన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (PBKS)ను 6 పరుగుల తేడాతో ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి IPL టైటిల్ను గెలుచుకుంది. ఈ మ్యాచ్లో RCB విజయంలో అతిపెద్ద సూపర్స్టార్ కృనాల్ పాండ్యా. తన స్పెల్తో మొత్తం మ్యాచ్ను మలుపు తిప్పేశాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసి 190 పరుగులు చేసింది. కానీ ఈ స్కోరు అంత బలంగా కనిపించలేదు.
విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులు నెమ్మదిగా ఆడాడు. ఫిల్ సాల్ట్ (18), మయాంక్ అగర్వాల్ (24), రజత్ పాటిదార్ (26), లియామ్ లివింగ్స్టోన్ (25) వంటి ఆటగాళ్ళు తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. ఇక పంజాబ్ బౌలింగ్లో జేమీసన్ విధ్వంసం సృష్టించాడు. అతడు పాటిదార్, సాల్ట్ వంటి ముఖ్యమైన వికెట్లు తీసుకున్నాడు. జేమీసన్ మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు. కానీ 17వ ఓవర్లో లివింగ్స్టోన్, జితేష్ శర్మ అతడి బౌలింగ్లో చెలరేగి పరుగులు రాబట్టారు. మ్యాచ్ చివరి ఓవర్లో, అర్ష్దీప్ సింగ్ కూడా మూడు వికెట్లు తీసి RCB స్కోరు 200 దాటకుండా ఆపాడు.
191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో PBKS బాగానే ఆరంభించింది. పవర్ప్లేలో 52 పరుగులు చేసింది. ఓపెనర్లు కూడా మంచి ఆరంభం అందించారు. కానీ RCB బౌలింగ్.. ఆటను మలుపు తిప్పింది. ఇక మధ్యలో వచ్చిన శశాంక్ సింగ్ విజృంభించాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఒకనొక సమయంలో పంజాబ్ను గెలిపిస్తాడు అని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. కేవలం 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఓటమిని చవిచూసింది. శశాంక్ సింగ్ 30 బంతుల్లో 61 పరుగులతో చెలరేగిపోయాడు. కానీ అప్పటికి చాలా ఆలస్యం అయింది. చివరి ఓవర్లోని మొదటి ఫుల్-టాస్ బంతిని శశాంక్ కొట్టి ఉంటే ఫలితం పంజాబ్కు అనుకూలంగా ఉండేది. చివరి ఓవర్లో పంజాబ్కు 29 పరుగులు అవసరం కానీ వారు 184/7 మాత్రమే కొట్టారు.
కృనాల్ పాండ్యా హీరో
ఈ మ్యాచ్లో కృనాల్ పాండ్యా తన 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతని టైట్ బౌలింగ్ కారణంగానే ఆర్సిబి జట్టు తిరిగి విజయాలవైపు వచ్చింది. ఆర్య ఔట్ అయిన తర్వాత కృనాల్ పాండ్యా స్పెల్ ప్రారంభమైంది. ఏడో ఓవర్లో కృనాల్ను తీసుకొచ్చారు. అక్కడ అతను తన స్పెల్లోని మొదటి ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
దీని తర్వాత మరో ఓవర్లో కృనాల్ కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రభ్సిమ్రాన్ సింగ్ ను అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రొమారియో షెపర్డ్ పంజాబ్ కెప్టెన్ శ్రేయర్ అయ్యర్ ను అవుట్ చేసి ఆటను ఆర్సీబీకి అనుకూలంగా మార్చాడు. తర్వాత కృనాల్ తన మూడవ ఓవర్లో 7 పరుగులు ఇచ్చాడు. ఒకవైపు కృనాల్ వేసిన 3 ఓవర్లు అద్భుతంగా ఉండటంతో నాల్గవ ఓవర్ కు కూడా అతన్ని తిరిగి తీసుకున్నారు. చివరి ఓవర్లో జోష్ ఇంగ్లిస్ ను అవుట్ చేయడం ద్వారా కృనాల్ మొత్తం మ్యాచ్ ను ఆర్సీబీకి అనుకూలంగా మార్చాడు.