భారతదేశం ‘ఆపరేషన్ సిందూర్’తో నిరాశ చెందిన పాకిస్తాన్ సైన్యం గురువారం రాత్రి భారతదేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలోని అనేక సైనిక స్థావరాలపై డ్రోన్, క్షిపణి దాడులకు ప్రయత్నించింది. కానీ భారత్ ఆర్మీ ఈ దాడులను S-400 వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా తిప్పికొట్టింది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం క్షిపణులను ప్రయోగించి, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ ఈ దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ కార్యాలయాలు, నీటి శుద్ధి కర్మాగారాలు, కోర్టులు, విదేశీ రాయబార కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, మాల్స్, మార్కెట్లు వంటి ట్రాఫిక్ ప్రాంతాల వద్ద ప్రత్యేక నిఘా ఉంచారు.
ముఖ్యమైన ప్రదేశాలన్నింటినీ రక్షించడానికి పారామిలిటరీ దళాలతో సహా అదనపు దళాలను మోహరించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇదిలా ఉంటే భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇవాళ (శుక్రవారం) ఢిల్లీలో సైరన్ మోగింది. ఐటీఓలోని పీడబ్ల్యూడీ భవన్ పైకప్పుపై వైమానిక దాడుల సైరన్ను అధికారులు పరీక్షించారు. సైరన్ పరీక్ష మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై దాదాపు 15-20 నిమిషాల పాటు కొనసాగింది.
రాజధానిలోని అన్ని ఎత్తైన భవనాలపై ఇలాంటి సైరన్లను ఏర్పాటు చేస్తామని ఢిల్లీ పిడబ్ల్యుడి మంత్రి ప్రవేశ్ వర్మ తెలిపారు. ఢిల్లీలో సైరన్లు అమర్చే పని ప్రారంభమైందని ఆయన చెప్పారు. దీని పరిధి 8 కిలోమీటర్ల వరకు ఉంటుందని.. ఈ రాత్రి నుండి ఎత్తైన భవనాలపై మరో 40-50 సైరన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వీటిని ఒకే కమాండ్ సెంటర్ నుండి ఆపరేట్ చేయవచ్చని తెలిపారు. ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమేనని, భయపడాల్సిన అవసరం లేదని పరిపాలన పౌరులకు విజ్ఞప్తి చేసింది.